Wednesday, September 18, 2013

thanikella bharani


తనికెళ్ళ భరణి గారి గురించి, అతనితో నాకు జరిగిన పరిచయం గురించి ఈరోజు మీతో చెబుతాను.

చాలామందికి అతను నటుడిగానే తెలుసు. కొద్దిమందికి అతను రచయిత అని తెలుసు. అతను మాటలు రాసిన “లేడీస్ టైలర్” “శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్” వంటి చిత్రాలు నవ్వుల పువ్వులు పూయించాయి. తరువాత అతను “శివ” సినిమా” కి కూడా మాటలు అందించారు.
అంతకు ముందుగానే రంగస్థల నటుడిగా రాణించిన ఆయనకి సినిమాల్లో నటించడం పెద్ద కష్టం కాలేదు.ముఖ్యంగా “అతడు”, “జల్సా” సినిమాల్లో అతని నటన చాలా రోజులు గుర్తుండిపోయేలా చేస్తుంది. “ఆడు మగాడురా బుజ్జి” అంటూ అతడు సినిమాలో అతను పండించిన విలనీ అద్భుతః...!
సినిమాల్లో రాకమునుపే రంగస్థలం మీద మంచి నాటకాలు రాసి పేరు తెచ్చుకున్న భరణి  ప్రతిభ చాలా మందికి తెలీదు.
ఆయన రాసిన “జంబూ ద్వీపం” “కొక్కోరోక్కో” వంటి నాటకాలు అతనికి మంచి పేరు తెచ్చి పెట్టాయి.
ఆయనలో అద్భుతమైన రచయిత వున్నాడు. “ఆటగధరా శివా” అని శివుడు మీద రాసిన పద్యాలు చాలా బావుంటాయి.
“శెభాష్ రా శంకర” అంటూ తెలంగాణా మాండలికం లో శివుడ్ని స్తుతిస్తూ ఆయన చేసిన ప్రయోగం బాగుంటుంది. ఆయన మహా శివ భక్తుడు.
ఆయన రచనలలో నాకు బాగా నచ్చింది “నక్షత్ర దర్శనం” అనే పుస్తకం. అందులో చాలామంది సినీ నటులు మీద,రచయితల మీద, దర్శకుల మీద ఆయన రాసిన పొయెట్రీ చాలా బావుంటుంది.
ముఖ్యంగా సూర్యకాంతం గురించి రాసిన రెండు మాటలు ఇక్కడ రాస్తాను.

“సూర్యకాంతం తెర మీద విరిస్తే చాలు చుక్కలు దిక్కులు చూసేవి, సూర్యుడు బిక్కమొహం వేసేవాడు.ఏ పాత్ర అయినా ఎడం చేత్తో చేసి అవతల గిరవాటేసేది..ఆవిడ అవతారం ఎత్తితే కోడళ్ళు కోయ్యబారేవారు, అల్లుళ్ళు అడ్రస్ లేకుండా పోయేవారు..
ఆవిడ వేలెత్తి చూపించటానికి వీల్లేనంత నటన చేసింది, ఆవిడ పేరు ఆంధ్రదేశంలో ఇంకెవల్లకీ పెట్టడానికి వీల్లేకుండా చేసింది..” అని రాశారు.
అది నిజం. అందుకే గుండమ్మ కధ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అది ఈ తరం లో చాలా మంది దర్శకులు తీద్దాం అనుకున్నా, ఒక్క సూర్యకాంతం పోషించిన పాత్రకి సరిపడా నటులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు.
ఇలా చాలా మంది గురించి మంచి పొయెట్రీ వుంది. ఈ పుస్తకం దొరికితే చదవండి.

ఇక ఆయన రాసిన “పరికిణీ “ అయితే చెప్పడానికి మాటలు చాలవు.
పెళ్ళికాని ఒక అమ్మాయి బాధ వర్ణిస్తూ “ ఎక్కడ పెళ్ళి భజంత్రీలు మోగినా గుండెల్లో ముగ్గేసినట్టుంటుంది.ఎసట్లో పోసే బియ్యం తలంబ్రాలు అవుతాయి.ఓణీ మాటి మాటికీ జారుతుంది. ఎవరన్నా చూస్తారేమో అన్న భయం. ..చూస్తే బావున్ను అన్న కోరిక..!” అంటారు. ఆయన ఎక్స్ప్రెషన్ బాగుంటుంది.
“మంచులో తడిసిన నందివర్ధనం పువ్వు లాంటి బామ్మ “ అంటారు వాళ్ళ బామ్మ ని.
వాళ్ళావిడ గురించి ఏదో కవిత చెబుతూ “ ఏడ్చే పసివాడికి పాలసీసా అయిపోతుంది.అత్తగారి నడ్డికింధ పీటైపోతుంది. మావగారికి కాఫీ ఫ్లాస్క్ అయిపోతుంది. రాత్రి పడగ్గదిలో నాకు రగ్గయి పోతుంది. పొద్దునే వాకిట్లో ముగ్గయిపోతుంది.
మా ఆవిడకి మంత్రాలొచ్చు...” అంటారు.
ఇక ఆడ పిల్లలు వోణీ మర్చిపోతున్నారు అన్న బాధతో “పరికిణీ” రాశారు.
అందులో ఇలా అంటారు.
“దండెం మీద ఇంద్రధనుస్సుని పిండి ఆరేసినట్టుంటుంది.
కోడిపెట్టంటి వయస్సుని కప్పెట్టే బుట్టల్లె వుంటుంది.
ఐస్ ఫ్రూట్ మీద వుండే వుల్లిపోర కాగితం లా, కొత్తావకాయ జాడీ మీద కప్పెట్టిన వాసనలా,
మాధుర్యాన్ని అంతా గుండెల్లో దాచుకున్న తేనెపట్టు లాగ,సరకులన్నీ వున్నా తెరవని కిరాణకొట్టులాగా వుండే అద్భుత దేవతావస్త్రం పరికిణీ...
స్వప్నాల డాభా మీద నాలుగు చెరగులు పరిచి, కుర్రాళ్ళ గుండెల్ని ‘పిండి’ వడియాలు పెట్టేసిన జాణ—ఓణీ .” అంటారు.

ఖాళీ దొరికితే ఈ బుక్స్ చదవండి. మనకి అర్ధమయ్యేలా సర్రియలిస్టిక్ పొయెట్రీ రాశారు ఆయన.
ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన మిధునం సినిమా...చక్కని చిక్కని తెలుగు సినిమా..

“ఆటగద జననాలు...ఆటగద మరణాలు....మధ్యలో ప్రణయాలు ఆట నీకు...
ఆటగద సొంతాలు ..ఆట గద పంతాలు..ఆట గద అంతాలు....ఆట నీకు...
ఆటగదరా మన్ను..ఆటగదరా మిన్ను...మిధ్యలో వుంచి ఆడేవు నన్ను..” అంటారు “ఆటగదరా శివ” లో.

ఆయనతో “డి ఫర్ దోపిడీ “ సినిమా షూటింగ్ లో కూర్చుని చాలా సేపు మాట్లాడాను. అది నా అదృష్టం.

ఇతి శివం...... 

No comments:

Post a Comment