Friday, August 1, 2014

Chivariki migiledhi

Article about book "Chivariki migiledhi" by bucchi babu garu written in 1952.

చాలా రోజులుగా నా బుక్ షెల్ఫ్ లో ఉన్న “చివరికి మిగిలేది” అన్న పుస్తకం తీసి ఈ మధ్యే చదవటం మొదలెట్టాను. ఒక సంవత్సరం గా ఉన్న ఈ పుస్తకం చదువుదామని ఎప్పుడు మొదలు పెట్టినా ఇరవై పేజీలు చదివేసరికి నిద్ర వచ్చేది. మరి అలాంటిది ఈ పుస్తకం తెలుగు సాహిత్య చరిత్రలో ఎలా క్లాసిక్ అయ్యిందా అనుమానం చాలా రోజులుండి, ఇది ఎలాగైనా పూర్తి చేసి విషయం తెలుసుకోవాలన్న కుతూహలం తో మళ్ళీ మొదలెట్టి ఈ రోజే పూర్తి చేశాను. ఇది 1952  లో రాసిన పుస్తకం అవ్వడం వలన , ఇతర పని ఒత్తిడుల వలన చదవటానికి కొంచెం టైం పట్టింది.
కాని , ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ ఉద్విగ్నం , చదివేసిన తరువాత “అరె ఇంత త్వరగా అయిపోయిందా?” అన్న భావన , ఎన్నో అనుభవాలు , జ్ఞాపకాలు గుర్తుచేసి , అనుభూతులు మిగిల్చిన అద్భుతం... నిజంగా ఇలాంటి పుస్తకాన్ని షెల్ఫ్ లో పెట్టేసినందుకు కొంత బాధ కలిగినా..ఇప్పటికైనా చదవగలిగినందుకు సంతోషం,  ఎంతో ఆనందంగ ఉంది. ఇది బుచ్చిబాబు గారు ఎన్ని ప్రసవ వేదనలు అనుభవించి రాసుంటారో ఊహించడమే కష్టం. ఇది ఒక క్లాసిక్ ఎందుకయ్యిందో ఈరోజే నాకు అర్ధమయ్యింది. అది ఎవరికీ వారు చదివి తెలుసుకోవాలి.
ఈ పుస్తకం “చివరికి మిగిలేది” ఏమిటి అనే ప్రశ్న తో మొదలై, చివరికి ఏమీ మిగలదు ...కొన్ని జ్ఞాపకాలు తప్ప అనే చివరి వాక్యంతో ముగుస్తుంది..కాని మధ్యలో కొన్ని జీవితాలని స్ప్రుశిస్తాడు రచయిత. జీవితాన్ని కాచి వడబోసి, క్రాస్ సెక్షన్ ఆఫ్ లైఫ్ ని మైక్రోస్కోప్ కింద పెట్టి మనకి చూపిస్తాడు ఆయన.
నిజంగా ఇంత గొప్ప పుస్తకం చదవగలగడం నా అదృష్టం. దీనిని గురించి విమర్శించే అర్హత , స్థాయి రెండూ నాకు లేవు, అందుకే పూర్తి స్థాయి పాఠకుడిగా చదివి ఆస్వాదించా. దీనివల్ల  ఒక మంచి పాఠకుడిగా అర్హత సంపాదించుకున్నందుకు గర్వంగా ఉంది. ఒక విషయం తెలుసుకున్న లేదా చూసినా, చదివినా అది పక్కవాల్లకి చెప్పాలనుకునే సహజ బలహీనత తో ఈ వ్యాసం రాస్తున్నా.
 “అమృతం కురిసిన రాత్రి”, “మహా ప్రస్థానం” ,” అసమర్ధుని జీవయాత్ర” తరువాత మరొక గొప్ప పుస్తకం చదివాను. సాహిత్యాన్ని చదవగలగడం,తద్వారా అనుభవం గడించడం నిజంగా అదృష్టం. తెలుగు సాహిత్యాన్ని చదివే శక్తి నాకు ఇచ్చినందుకు, ఆ బాష లో మాధుర్యం అందుకోగలిగే వరం దొరికినందుకు , మన బాషకి , దైవానికి , గురువులకి, రచయితలకి నిజంగా నా కృతఙ్ఞతలు, నమస్కారాలు.
చదవాలని జిజ్ఞాస , కోరిక వున్న వాళ్ళు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం..ఇది కొంత మేరకు మీ ఓపికని, సహనాన్ని పరిక్షించచ్చు. అయినాగాని చదవగలిగితే మధురానుభూతి మిగులుతుందని ఖచ్చితంగా చెప్పగలను. రచయిత చెప్పిన విషయం అర్ధం చేసుకోలేని పక్షం లో అది ఖచ్చితంగా అది మన అసమర్ధతే తప్ప అది రచయితధి కాదు. అందుకే ఇది చదివి మీ అనుభవాన్ని పెంచుకోండి...లేదంటే జీవితం లో ఏమీ ఆగిపోవు, ఏమీ కోల్పోరు...జీవితం లో అనిర్వచనీయమైన ఒక్క గొప్ప అనుభవం తప్ప.

No comments:

Post a Comment