Friday, October 4, 2013

Open letter to all politicians

చేతకాని ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే తెలుగు ప్రజలకు తగిన శాస్తి జరిగింది. సినిమా నటులను రాజకీయనాయకులుగా ఎన్నుకుంటే సినిమాలు లేవు కదా అని రాజకీయాలలో నటించడం మొదలుపెట్టారు. “మేమేం తక్కువ తిన్నామా..?” అని మిగిలిన రాజకీయనాయకులు నటించడం మొదలెట్టారు.
ఈ పరిస్థితి చూస్తుంటే మనకి అవసాన దశ దాపురించింది అని భయం వేస్తోంది. హైదరాబాద్ లో వుండే అందరికీ ఒక అభద్రతా భావం కమ్మేసుకుంటోంది...మన భవిష్యత్తు ఏంటా అని...?
ఈ రాజకీయ నాయకులు అందరూ కోట్లు గడించి వున్నారు. అందుకే  నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు.
అయితే తప్పు వాళ్ళది కాదు, వాళ్ళని ఎన్నుకున్న మనది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రజలారా...
మన మనోభావాలు కాదు అని రాష్ట్ర విభజనకు పూనుకున్న కేంద్ర ప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వం దగ్గర రెండు నెలలుగా ప్రజలు సీమాంద్రలలో ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలియజెప్పలేని మన ప్రజా ప్రతినిధులకి అందరికీ బుద్ధి చెప్పండి.
కనీసం మీ కష్టం ఏంటి అని అడగ లేదు...మేము మీకోసం వుంటాం అని భరోసా ఇవ్వలేదు. మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం అని నమ్మకం కలిగించలేదు. ..వీళ్ళా మన ప్రజాప్రతినిధులు, మంత్రులు, కేంద్ర మంత్రులు..ప్రధాన మంత్రులు..
ఎప్పుడూ నోరు మెదపని మౌన మోహన్ గారూ....మీ రాష్ట్రాన్ని ఇలాగే ముక్కలు చేస్తే , నిర్ణయం అయిపోయింది, సంయమనం పాటించండి అంటారా...?
అయ్యా షిండే గారు, దిగ్విజయ్ సింగ్ గారు....మీకు అప్పజెప్పిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలూ ఇలాగేనా చక్క దిద్దేది. కనీసం ఎనిమిది కోట్ల ప్రజానీకం తాలుకా మనోభావాలు, అభిప్రాయాలు మీకు అక్కర్లేదా..?
ఏ ఒక్కరైనా..ఒక్కరోజైనా వాళ్ళని అడిగి విషయం తెలుసుకున్నారా...?
అయ్యా/అమ్మా కేంద్రమంత్రులు....చీ...మిమ్మల్ని అని కూడా లాభం లేదు. ఎందుకంటే...సగటు సామాన్యుడు పేపర్ చూస్తే ఎంత తెలుస్తుందో, కేంద్ర మంత్రి వర్గం లో వుండి మీకు కూడా అంతే తెలుసు. రాజకీయం అంటే “ హై కమాండ్ తో మాట్లాడం..” అని ప్రతీదానికి మీడియా ముందు వాగడం కాదు. అవసరమైతే పదవీ త్యాగం చేసైనా సమైక్యాంద్ర వాణి వినిపించే దమ్ము వుండాలి. ఎక్కడ పదవి పోతుందో అని ఇంట్లో కూర్చోడం కాదు.
అయ్యా ఎమ్మెల్యేలు/ ప్రతిపక్ష పార్టీలు...ఎంత సేపూ “ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం...ఆ రెండు పార్టీలు ఏకమయ్యిపోయాయి..” అని వాగొద్దు. ఇప్పటికైనా అన్ని పార్టీలు కలిసి ఉద్యమించండి. రాజకీయాలకి అతీతంగా పోరాడండి. తెలుగువాడిది గోడు కాదు....తెలుగువాడి వాడీ, వేడీ చూపించండి.
చాలామంది అన్నట్టు రాజశేఖర్ రెడ్డి బతికి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటే, ఆయన కొడుకు తిరిగి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన సోనియా తనయుడు రాహుల్ గాంధి ప్రదానమంత్రిత్వానికి సపోర్ట్ చేస్తే....అది నీచం.అందుకోసమే ఆయనకీ బెయిల్ వచ్చింది అన్నది నిజమయితే.. దివంగతులైన రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ క్షోబిస్తుంది.
చంద్రబాబు గారు...” తెలుగు వాడి ఆత్మగౌరవం” నినాదంతో ముందు కొచ్చిన టి.డి.పి. పార్టీ, తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా అభివృద్ధికి పాటుపడ్డారు అని డబ్బాలు కొట్టడం ఆపండి.  “మమ్మల్ని కాంగ్రెస్ తొక్కేయ్యడానికే ఇలా కుట్ర పన్నారు..” అంటూ మీడియా లో ఏడవద్దు..నిజంగా, నిజాయితీ తో యుద్ధం చెయ్యండి..తెలుగు ప్రజానీకం మీ వెంటే వుంటారు.
 ఇప్పుడు కావాల్సింది రాజకీయం కాదు...నాయకత్వం...
ఇప్పుడు కావాలసింది ఎవడో పడేసే భిక్ష కాదు...ప్రజానీకానికి రక్ష...
తెలుగు ప్రజల మీద సింపతీ చూపించకండి..మన భావితరాల భవిష్యత్తు మీద ఎంపథీ చూపించండి.

చివరగా...అమ్మా మహాతల్లి..సోనియమ్మా....
నీ కొడుకు రాజకీయ భవిష్యత్తే గాని...ఇక్కడ రాష్ట్రం లో వుండే తల్లులు, వాళ్ళ పిల్లల జీవితాల మీద నీకు ఇసుమంతైనా గౌరవం లేదేమమ్మా...ప్రజల మాట వినకుండా, ప్రజాప్రతినిధుల మాట పెడ చెవిన పెట్టిన నువ్వే కాంగ్రెస్ పార్టీ పతనానికికి గొయ్యి తవ్వావు. నీ దృష్టి లో దిగ్విజయ్ సింగ్, షిండే, అహ్మద్ పటేల్ , చిదంబరం తప్ప మిగతా ఎవరూ రాజకీయ నాయకులు లా , మనుష్యులులా కనపడలేదా..?వాళ్ళ మాట వినాలనిపించలేదా?
తల్లిదండ్రులకి దూరంగా వుంటూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు...,   పెళ్ళాం, పిల్లలని ఊర్లలో వదిలేసి , కూలీకి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు, రోజూ ట్రాఫిక్ లో, ఎండల్లో, వర్షాల్లో తడుస్తూ,  బస్సుల్లో,రైళ్ళలో ప్రయాణాలు చేస్తూ కుటుంభాన్ని పోషించుకునేవాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో వున్నారు..వాళ్ళు ఎవరూ నీ కళ్ళకి కనపడలేదా..?  హైదరాబాద్ అంటే ఒక్క రాజకీయనాయకులు, రియల్ ఎస్టేటులు, ఫైవ్ స్టార్ హోటళ్ళు కాదు.
హైదరాబాద్ అంటే...ఎంతోమంది జీవితానికి భరోసా,..భవిష్యత్తు మీద నమ్మకం. ...ఏదో చిన్న ఉద్యోగం దొరక్కపోదా అనే ఆశ.
ఇవన్నీ కాల రాసిన నీకు, నీ పార్టీ కి పుట్టగతులుండవు
విడగొడితే రాహుల్ గాంధి పి.యం. అవుతాడనేగా నీ ఆలోచన. అది శుద్ధ తప్పు.
ప్రజలందరూ ఏకమయితే...వచ్చే ఎన్నికలలో పూర్తిగా అన్ని పార్టీలని బహిస్కరిస్తే, ఏ ఒక్క రాజకీయ నాయకుడికీ ఓటు వెయ్యకపోతే...అప్పుడు నీ కొడుకు పరిస్థితే కాదు..ఈ రోజు ఇళ్ళల్లో దాక్కొని, ఎక్కడెక్కడో దాక్కున్న రాజకీయ నాయకుల భవిష్యత్తులన్నీ అగమ్యగోచరం అవుతాయి...
సామాన్యుడు అంటే, ...నువ్వు కేబినేట్ మీటింగ్ లో కూర్చుని తీర్మానం చేసేసి, నిర్ణయం అయిపోయింది అని చెలరేగిపోతే....చూస్తూ వూరుకోడు. తీర్మానం ఇంకా కాలేదు. ఇంకా ముందుంది ప్రజా తీర్మానం...ఓటు అనే ఆయుధం.
ఈరోజుతో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికీ, , స్కూల్ పిల్లకి, చివరికి చిన్నపిల్లాడికి కూడా అర్ధమవుతోంది మీ రాజకీయం... పార్టీ జెండా మోసే కార్యకర్తలకి అర్ధమవుతోంది ఇన్నాళ్ళు ఎలాంటి పార్టీలకి, ఎలాంటి వ్యక్తులకి కౌమ్ము కాసి, జెండా మోసారో....!ఎవడికి ఊడిగం చేసి గెలిపించారో..
ఒక్కసారి వాళ్ళు తిరగబడితే, ఆ సునామీ లో ఏ ఒక్క రాజకీయనాయకుడూ మిగలడు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓటు అడగటానికి వస్తారు. ఏం చెప్పి ఓటు వెయ్యమని అడుగుతారు. “మన పరువు డిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టాం బాబు, మమ్మల్ని గెలిపించండి..” అంటారా..? మళ్ళీ వీళ్ళకి ఓటు వెయ్యడానికి మనకి సిగ్గుండాలి.
ప్రజలారా...!
సి.డబ్ల్యు.సి తీర్మానం అయిపోవచ్చు, కేబినెట్ దానికి గంగిరెద్దులాగా తల వూపవచ్చు. అసెంబ్లీ మాట తీసికట్టు అని డిల్లీ పెద్దలు చెప్పవచ్చు. రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధించచ్చు...తెలంగాణా ఇవ్వచ్చు. ఎంత మంది రాజకీయనాయకులని కొన్నా, ఎన్ని చీకటి వ్యవహారాలూ నడిపినా, చివరికి మన తీర్మానం మిగిలుంది. రాష్ట్రంలో మన ఆస్తులు ద్వంసం చెయ్యదు. ఈ తుచ్చ రాజకీయవాదులందరూ మన గుమ్మం ఎక్కుతారు...ఓట్లకోసం.
అందరినీ చెప్పు తీసి కొట్టండి...ఎన్నికలు బహిస్కరించండి...
నిర్భయని రేప్ చేసినవాడికి ఉరిశిక్ష వేస్తే, ఆడపిల్లలకి అన్యాయం చెయ్యడానికి ఇక మగాడు ముందుకురాడు అన్న తీర్పు కరెక్ట్ అయితే, ఇలా మన తెలుగు తల్లిని ఏడిపించి మన భవిష్యత్తు నాశనం చేసిన ఈ రాజకీయ నాయకులందరికీ చెంప పెట్టు కావాలి అంటే, ఇంక ఏ రాజకీయనాయకుడు నీచ రాజకీయాలకు పాల్పడకూడదు అంటే, ఇలా వాళ్ళని రోడ్లమీదకు తీసుకురావాలి. అందుకు ఓటు ఒక్కటే ఆయుధం...

అమ్మా సోనియా గాంధీ గారు , అందరికీ ఇలా కడుపుమంట మిగిలిస్తే నీ కొడుకు ప్రధానమంత్రి కావాలనుకునే కల ..కల లాగానే వుండిపోతుంది.
ప్రజలకోసం పార్టీలు పుట్టాయి....పార్టీల కోసం ప్రజలు కాదు...
సీట్ల కోసం , నోట్ల కోసం కాదు..దేశం.
ఇవన్నీ గుర్తెరిగి మసలుకోండి.


No comments:

Post a Comment